అనకాపల్లిలో విశాఖ ఉమ్మడి జిల్లా మెగా అభిమానుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి రాజకీయ నాయకులే కారణమని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వేలకోట్లు దోచుకున్నారని అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఒకవైపు జీవనదులు ప్రవహిస్తోన్నా రైతులకు సాగు నీరు అందడం లేదన్నారు. చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు, కార్మికులు రోడ్డున పడ్డారని, మరోవైపు చాలా గ్రామాల్లో తాగు నీరు కూడా అందడం లేదని అన్నారు. కాలుష్యం ప్రాణాలు కబలిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లిపోతున్నారని అన్నారు.
ఇక్కడి రాజకీయ నాయకులకు భూములు కబ్జా చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లేదని ఆవేదన వ్యక్తం చేసారు. మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోవాలని, మన ప్రజల బాగోగులు మనమే చూసుకోవాలని ఉత్తరాంద్ర వెనుకబాటు తనాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించి ముందుకు రావాలని కోరారు. మరో రెండు నెలలు అందరం కలిసికట్టుగా పనిచేస్తే వై.సీ.పీ. దుష్టపాలన నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు.