అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలపురంలో శనివారం ఇండియా కూటమి స్థానిక సామ్రాట్ హోటల్ నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమిలో భాగ స్వాములైన కాంగ్రెస్, అమ్ ఆద్మీ వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుందని కూటమి నేతలు తెలిపారు.
జిల్లాలో తామంతా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నామని వారు వెల్లడించారు. ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎం.పీ. అభ్యర్థి జంగా గౌతం మాట్లాడుతూ… సేవ్ నేషన్ సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ ప్రధానమైన అజెండాగా ప్రజల్లోకి వెళుతున్నామని అన్నారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశానికి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వై.సీ.పీ. పరోక్షంగా, టీ.డీ.పీ., జనసేన పార్టీలు ప్రత్యక్షంగా బీ.జే.పీ. నీ బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.