ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్రం సుముఖంగానే ఉందని తెలిపారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులైన 1.6 లక్షల మందికి పునరావాసం కల్పించడం అనేది ప్రాజెక్టులో కీలకమైన విషయమని అన్నారు. దీనికోసం సుమారు రూ. 33వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవసరం అవుతుందన్నారు.
దీనిని రాష్ట్ర ప్రభుత్వం తగిన మొత్తంలో భరించాలి. వై.సీ.పీ. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వినియోగించుకుంది తప్పితే… ప్రాజెక్టు పూర్తికి కనీసం చొరవ చూపలేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ తాగు, సాగు నీరు అందించే అద్భుతమైన పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించుకోవాలంటే మొదట ప్రాజెక్టు కోసం తమ భూములు, ఆవాసాలు త్యాగం చేసిన గిరిజనులు, గిరిజనేతరులకు తగిన న్యాయం జరగాలన్నారు. దీని కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించేలా ప్రత్యేక సెస్ ను విధించే ప్రతిపాదనను చేస్తున్నానని చెప్పారు.