శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, మహిళలపై అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ బహిరంగ సభ ఎల్విన్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద కాశి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబెడ్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో మతోన్మాదం మహిళల హక్కులకు ప్రధాన శత్రువని, పురుషాధిక్యతకు వ్యతిరేకంగా మహిళలు నిరంతర పోరాటం నిర్వహించడం ద్వారా మాత్రమే సమాన హక్కులు సాధించుకోగలమని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మాట వరసకు మాత్రమే మహిళా సాధికారత అనే పదాన్ని వాడతారని, డబ్బులు పంచడమే మహిళా సాధికారతా అని ప్రశ్నించారు.
పరిశ్రమల్లో, పని ప్రదేశాల్లో పురుషుల కంటే తక్కువ వేతనాలు మహిళలకు చెల్లిస్తున్నారని, ఆక్వా, జీడి పిక్కల పరిశ్రమలలో మహిళలకు కనీస చట్టాలైన పి.ఎఫ్., ఈఎస్ఐ, రక్షణ పరికరాలు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు పరిపాలనలో కూడా సగభాగం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్. లీలా ప్రశాంతి, చెల్లె సునీతా, భూపతి సుమలత, పి. బేబీ శ్యాంమల, తదితరులు పాల్గొన్నారు.