![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/JSP-PAC-Chairman-Nadendla-Manohar.jpeg?resize=640%2C673&ssl=1)
- కొత్త విధానం పేరుతో జగన్ క్విడ్ ప్రో కో
- ఐబీ సిలబస్ ను బలవంతంగా రుద్దే కుట్ర
- జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
‘పేద విద్యార్థుల పేరుతో విద్యా శాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కాకినాడలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి తన స్వలాభం కోసం విద్యా శాఖను అక్రమాలకు అడ్డాగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ- ఐబీ (ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్ ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు చేసుకుంటున్న ఒప్పందం వైసీపీ ప్రభుత్వ అవినీతికి కేంద్ర బిందువన్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి క్విడ్ ప్రో కోకి సజీవ సాక్ష్యం’ అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమం అని, తర్వాత సీబీఎస్ఈ సిలబస్ అని మాయ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి తాజాగా ఐబీ సిలబస్ ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధం అవుతున్నారన్నారు. ఇదంతా ఆయన స్వప్రయోజనం కోసం విద్యార్థులపై బలవంతంగా చేస్తున్న ఒత్తిడి ప్రయోగంగా అభివర్ణించారు. ఐబీ కరిక్యూలమ్ అనేది ప్రపంచంలో కేవలం 4 వేల పాఠశాలల్లో మాత్రమే అమలవుతున్న విధానం. ప్రపంచవ్యాప్తంగా ఐబీ సిలబస్ ఉన్న పాఠశాలల్లో దేశం మొత్తం మీద కేవలం 212 పాఠశాలల్లో మాత్రమే ఐబీ సిలబస్ అమలవుతోంది. అంటే ఈ సిలబస్ అత్యున్నత, అత్యుత్తమమైనది కాదనే విషయం స్పష్టం అవుతోంది. అలాంటి సిలబస్ ను రాష్ట్రంలో 40వేలకు పైగా ప్రభుత్వ స్కూల్స్ లోకి తీసుకురావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఐబీ సిలబస్ చదివి అద్భుతమైన విజ్ఞానం పొంది, శాస్త్రవేత్తలు అయిన వాళ్లు లేదా గొప్పవాళ్లు అయిన వ్యక్తులెవరూ లేరని, అటువంటప్పడు హడావుడిగా రాష్ట్రంలోని 44,381 ప్రభుత్వ పాఠశాలలతోపాటు, 13,406 ప్రైవేటు పాఠశాలలు, 839 ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ను బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఎస్ఈ స్కూల్ల ఏర్పాటు నిమిత్తం ఒక్కో పాఠశాలకు రూ.లక్ష చెల్లించలేని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఐబీ సిలబస్ అమలు కోసం ఒక్కో పాఠశాలకు రూ.13 నుంచి రూ.17 లక్షల మేర చెల్లించేందుకు సిద్ధం అవుతోందంటే దీని వెనుక ఆంతర్యం ఏమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.