జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘ కాలం వివిధ హోదాలలో పని చేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ ఆలీ విశ్రాంత జీవితం కుటుంబ సభ్యుల తో సుఖ శాంతులతో గడపాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. గురువారం స్థానిక ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది పదవి విరమణ చేసిన డివిజనల్ పి.ఆర్.ఓ. ఎం.డి. విలాయత్ ఆలీని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా డి.ఐ.పి. ఆర్.ఓ. మాట్లాడుతూ… నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు మంజూరులో డివిజనల్ పి.ఆర్.ఓ. విలాయత్ అలీ పూర్తి సహకారం అందించారన్నారు. తోటి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అంకిత భావంతో శాఖా పరమైన సేవలందిస్తూ పలువురి జిల్లాస్థాయి అధికారులు, పాత్రికేయుల ఆదరాభిమానాలను పొందారన్నారు. శాఖపరమైన కార్యకలాపాలు నిర్వహించడంలో మృదుస్వభావిగా పేరొందిన ఆలీ సిబ్బందితో ఒక కుటుంబంలో వ్యక్తి గా వ్యవహరిస్తూ సిబ్బందిని నొప్పించకుండా చాకచక్యంగా విధులు నిర్వహించి మంచి గుర్తింపు పొందారన్నారు.
సిబ్బంది పలువురు ప్రసంగిస్తూ… పదవి విరమణ చేసిన విలాయత్ ఆలీ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ విశ్రాంత జీవితం సుఖమయంగా సాగాలని అభిలసించారు ఈ కార్యక్ర మంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీ, టైపిస్టులు కే. భారతి శార్వాణి, కార్యాలయ రికార్డు అసిస్టెంట్ ఆర్.ఎస్ కుమార్, తదితరులు పాల్గొన్నా రు.