కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం కాకినాడ ప్రజల ఉపాధి కోసం 1985లో దివంగత కె.వి.కె. రాజు కాకినాడలో యూరియా తయారీ కర్మగారాన్ని నిర్మించారని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. ఇక్కడ యూరియా హబ్ గా అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు కాకినాడ ప్రజలు ముఖ్యంగా యాళ్ళ వారు, రైతులు, ప్రభుత్వం కలిసి 1000 ఎకరాలకు పైగా భూమిని సేకరించి పరిశ్రమ నిర్మించారన్నారు.
నేడు కె.వి.కె. రాజు గారి మనవడు, ప్రభుత్వ పెద్దలు దురుద్దేశంతో ఎన్.ఎఫ్.సి.ఎల్. భూములు స్వాధీనం చేసుకోవడం కోసం గ్రీన్ కో అనే సంస్థ ద్వారా తప్పుడు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. వాటి ఆస్తులను అప్పనంగా కొట్టేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వద్ద నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు కుట్ర చేశారని అన్నారు.
అందులో భాగంగానే ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తుల బదలాయింపులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని దీన్ని వెంటనే నిలిపివేయాలని సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాదులతో కలిసి కాకినాడ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి వినతిపత్రం అందజేశామని అన్నారు.