కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా బెజవాడ పురవీధులు ఎన్డీఏ కూటమి పక్షాల వికసిత నినాదాలు మిన్నంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నిర్వహించిన భారీ రోడ్ షో జయహో మోదీ జీ.. జయజయహో పవన్, జయహో చంద్రబాబు నినాదాలతో మారుమోగింది. బందరు రోడ్డులో ఎన్డీఏ అగ్రనేతలు ప్రచార రథంపై విహరించగా దేశ ప్రధానితో పాటు జనసేన, టీ.డీ.పీ. అధినేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం సాయంత్రం ఈ మెగా ఈవెంట్ కి రాజధాని నగరం విజయవాడ వేదిక అయ్యింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పక్షాలతో కలసి సభలు నిర్వహించిన ప్రధాన మంత్రి మోదీ, తుది అంకంలో రాజధాని నగరంలో రోడ్ షో తో ప్రచారాన్ని ముగించారు. మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.