దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఓవైపు రాజకీయ నేతలు చెబుతూ ఉంటే మరోవైపు ఇంకా అంటరానితనం సాంఘిక బహిష్కరణ వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ దళిత కుటుంబం తమ ఇంటికి వెళ్లేందుకు దారిలేకుండా చేసి తమను వేదిస్తూ అగ్ర కులాలవారు కుల వివక్ష చూపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే… అమలాపురం మెయిన్ రోడ్డు కి సమీపంలోని ఏడిద చక్రధర్ నగర్ లోని ఓ రోడ్డు వ్యవహారం కలకలం రేపింది. పదేళ్ల క్రితం ఇక్కడ రోడ్డు నిర్మించిన మునిసిపల్ అధికారులు రోడ్డుకి చివర్లో ఉన్న దళిత ఉద్యోగి అయిన తాళ్ల పల్లేశ్వరరావు ఇంటికి మాత్రం రోడ్డు, డ్రైనేజి వేయకుండా నిలిపి వేశారు. ఈ రోడ్డు చివర్లో 14 మీటర్ల మేర రోడ్డు నిలిపివేసి కేవలం తమ ఇంటికి మాత్రం రోడ్డు లేకుండా చేశారంటూ బాధితులు వాపోతున్నారు.
దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనంలేదని బాధితులు చెబుతున్నారు. ఇది కేవలం రోడ్డు సమస్య కాదని కుల వివక్ష అని, సామాజిక బహిష్కరణ అని వారు అంటున్నారు. దళితులమయినందునే తమకు సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సరాల నుండి ఇప్పటికీ కొనసాగుతుందని ఇప్పటికైనా అధికారులు మేల్కొని తమ కుటుంబం పట్ల కులవివక్ష చూపుతున్న సూత్రదారులను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.