బీ.జే.పీ. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక గ్రామీణ భారత బంద్ తలపెట్టారు. ఈ నెల 16న గ్రామీణ భారత బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 14 మండలాల్లో 100 గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని ఆదివారం ఉదయం స్థానిక శాంతినగర్ నుండి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీను తాటిపాక మధు జండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ… నరేంద్ర మోడీ వ్వవసాయం, పరిశ్రమలు ,గనులు, విద్యుత్, అటవీ సంపదలు, రవాణా బ్యాంకులు, ఎల్.ఐ.సి. తదితర సంస్థలన్నీటిని ఆదాని, అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పచెబుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు నగాష్టం వస్తుందని కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు కోడ్లు తెచ్చిందని ఆయన అన్నారు.
రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినా… మరొక రూపంలో వాటిని అమలుకు ప్రణాళిక వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.టీ.యూ.సీ. నాయకులు అన్నవరం, రామయ్య, శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అప్పలరాజు, రమేష్, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు