తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం పైకి చెప్పేదొకటి ఆచరణలో మరొకటిగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. రెండు పార్టీల సమన్వయ కమిటీ ఇటీవలే 14 మంది సభ్యులతో రాజమండ్రిలో సమావేశమైంది. ఉమ్మడి కార్యాచరణతో అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. కాగా పనసపాడు గ్రామం సామర్లకోట మండలంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ జ్యోతుల నవీన్ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ టికెట్ మరోసారి నిమ్మకాయల చినరాజప్పకు దక్కనుందని వ్యాక్యానించారు.
అయితే జనసేన పార్టీ నాయకులు “జనసేన జనబాట” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దాపురంలోని తాటిపర్తి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాల్సిందిగా అభ్యర్థించారు. ఉమ్మడి కార్యాచరణలో ముందుకు సాగుతున్న ఇరుపార్టీల నాయకులు సమన్వయ కమిటీ ప్రకటించకుండానే ఓట్లను అభ్యర్థించడం, సీట్లను ఆశించడం కాకినాడ జిల్లాలో చర్చానీయాంశంగా మారిందన్నారు.