కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతరంగం విశిష్టతను గుర్తించి చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పరికరాలు చేనేత కళాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా. ఎస్. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అపర్ణ దేవి గుడి దగ్గర బత్తుల మురళి కళావేదిక వద్ద జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు ఎస్. సంజీవ్ కుమార్, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు, గుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. గొల్లప్రోలు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరైన చేనేత పరికరములు, సోలార్ లైటింగ్ యూనిట్స్ ను చేనేత కార్మికులకు అందజేశారు. చేనేత కళాకారులకు వైఎస్సార్ చేనేత పింఛన్ పత్రాలతో పాటు సమర్త్ శిక్షణ పొందిన వీవర్స్ కు గుర్తింపు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా డా. ఎస్. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ… కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు చేనేత క్లస్టర్ కు సంబంధించి తాటిపర్తి గ్రామంలో 400 మంది చేనేత కుటుంబాలతో మమేకమైన గొప్ప అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. చేనేత కార్మికులు గతంలో చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపే వారిని ఆయన అన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందును గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేస్తునాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.