ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ మాట్లాడుతూ… కాకినాడ జిల్లా తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు వైద్య సేవలు అందించడం లో జి.జి.హెచ్. అద్భుతమైన సేవలు అందిస్తుందన్నారు.
అయితే ఈ కృషిలో శానిటేషన్ వర్కర్లు తనవంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. శానిటేషన్ వర్కర్లు ఇతరుల కంటే ఎక్కువ గా పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అందుకు తగిన విధంగా జీతాలు అందడం లేదన్నారు. అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు.
లేనిపక్షంలో సి.ఐ.టి.యు. అనుబంధ సంఘాలను కూడా ఆందోళనకు తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తో పాటు యూనియన్ నాయకులు ఆర్. రమేష్, జె. శేషు, ఎస్. వాసు, తదితరులు పాల్గొన్నారు.