కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రాజ్యాంగ హక్కుగా ప్రజలు తమ అవస్థలు తెలుపుకునే నిరసన హక్కు కొనసాగించాలని అఖిల పక్షం నేతలు జిల్లా ఎస్.పి. ఎస్. సతీష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం మాట్లాడుతూ… రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ధర్నాచౌక్ మార్చాలని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు అఖిల పక్షం డిమాండ్ గా జనవరి 26న నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు.
ఆ తరుణంలో ప్రకటించిన హామీ ప్రకారం కలెక్టర్ కృతిక్ శుక్లా ఆదేశాలతో ఆర్.డి.ఓ. ఇట్ల కిషోర్ పలు సార్లు సమావేశమయ్యారని అన్నారు. తుది సమావేశంగా డిఎస్.పీ. కే. హనుమంతరావుతో పాటు రాజకీయ పక్షాల ప్రజాసంఘాల నాయకులతో రెండుగంటల పాటు ఆర్.డి.వో. మీటింగ్ హాలులో సుదీర్ఘ సమావేశం నిర్వహించారని తెలిపారు. రెండు రోజుల్లో ఆర్.డి.వో. నివేదికను ఇస్తున్న దృష్ట్యా పోలీస్ శాఖ పరంగా కలెక్టర్ కు ఇచ్చే నివేదికలో అఖిలపక్షం సూచనలు పరిగణన లోకి తీసుకోవాలని కోరారు.
ఉప్పుటేరు వద్దకు మార్చిన ధర్నా చౌక్ నిర్వహణకు స్థలం కేటాయించకుండా అక్కడి పార్కును వినియోగించడం సుప్రీం కోర్టు ప్రకటించిన నియమాలకు విరుద్ధంగా వుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ ను ఆనుకుని వున్న ముసాఫర్ వీధిని రహదారిగా మార్చితే ప్రోటోకాల్ వాహనాలకు ప్రత్యేక మార్గం అవుతుందన్నారు. ఇదే ప్రదేశంలో వున్న ట్రావెలర్స్ బంగ్లా స్థలం నుండి కూడా మార్గ వినియోగం చేయవచ్చని తెలిపారు. కలెక్టరేట్ వద్ద నిరసన హక్కు ప్రదేశం నిర్ణయం చేయాలని ఏకగ్రీవ తీర్మానం ప్రతిని అందజేశారు.