కాకినాడ జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిధ్యాలయం పదవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్శిటీ అలూమ్ని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, యూనివర్శిటీ కులపతి ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. కాగా మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్ వెంకట శేషాచారి మరో ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి. రాజన్నకి గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. గవర్నర్, కులపతి ఎస్. అబ్దుల్ నజీర్ పి.హెచ్.డి. అవార్డు గ్రహీతలు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ… వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలోని యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు.
ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో విద్యా సంస్థల యొక్క బాధ్యత ఎంతో ఉందన్నారు. ప్రజల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వక్కానించారు. తమను తాము విశ్వసించాలని, తమ జ్ఞానం, సామర్థ్యాలపై అత్యంత విశ్వాసం చూపాలని సూచించారు. ప్రకాశవంతమైన రేపటి కోసం ఆశాజనకంగా ఉండాలని కోరారు.
తదనంతరం పదవ స్నాతకోత్సవంలో 64మందికి పిహెచ్డి అవార్డులు, 21మందికి బంగారు పతకాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జెఎన్టియుకె పాలక మండలి సభ్యులు, రెక్టార్ కెవి రమణ, రిజిస్ట్రార్ ఎల్ సుమలత, ఓఎస్డి డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.