భారతదేశానికి అగ్ని-5 క్షిపణి రూపంలో దివ్యాస్త్రాన్ని అందించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణి పని తీరు తెలుసుకుంటే దేశం గర్వించదగిన ఆవిష్కరణగా చెప్పక తప్పదని ఆయన అన్నారు.
ఐదు వేల కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఈ అస్త్రం ఛేదించడం మన దేశ రక్షణ వ్యవస్థకు అనితరమైన బలాన్ని అందిస్తుంటుందనడంలో సందేహం లేదన్నారు. పది వార్ హెడ్లను మోసుకువెళ్లడమే కాకుండా బహుళ లక్ష్యాలను ఒకే సమయంలో ఛేదించడం అద్భుతమన్నారు. ఇప్పటి వరకు అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, చైనా మాత్రమే ఇటువంటి ఆయుధ వ్యవస్థ కలిగి ఉండగా ఇప్పుడు మన దేశం కూడా వీటి సరసన చేరడం మన శాస్త్రవేత్తల నైపుణ్యానికి నిదర్శనం అని వారిని కొనియాడారు.