తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు బీ.జే.పీ. నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్.డీ.ఏ. గురువారం సీట్ల పంపకాన్ని ఖరారు చేసింది. మొత్తం 39 స్థానాల్లో బీ.జే.పీ. 20 స్థానాల్లో పోటీ చేయనుండగా, 19 సీట్లు మిత్రపక్షాలకు దక్కనున్నాయి. మరో నాలుగు నియోజకవర్గాల్లో బీ.జే.పీ. కి చెందిన కొన్ని మిత్రపక్షాలు ఆ పార్టీ ‘కమలం’ గుర్తుపై పోటీ చేయనున్నాయి.
దీంతో మొత్తం 24 స్థానాల్లో బీ.జే.పీ. కమలం గుర్తుపై అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా బీ.జే.పీ. కి మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలోని వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. మరోవైపు సీట్ల పంపకాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు పన్నీర్సెల్వం తన మద్దతుదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించవచ్చని అయితే శుక్రవారం బీ.జే.పీ. నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇవ్వవచ్చని వర్గాలు తెలిపాయి. బీ.జే.పీ. ప్రధాన కార్యాలయంలో విలేకరులతో టీ.ఎన్. బీ.జే.పీ. చీఫ్ అన్నామలై మాట్లాడుతూ… బీ.జే.పీ. నేతలు 24 మంది అభ్యర్థుల జాబితాతో న్యూఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చించనున్నారన్నారు.