ఎమెల్యే సీటు దక్కలేదన్న అక్కసుతోనే వై.సీ.పీ. గూటికి చేరినవాళ్ళు జనసేనానిపై అవాకులుచవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వీడియో సందేశంలో మాట్లాడారు… వాస్తవాలు వక్రీకరించేలా పోతిన మహేష్ అనుచిత వ్యాఖ్యలున్నాయని ఖండించారు. ఇటీవల పార్టీ మారిన మహేష్ అనతి కాలంలోనే వై.సీ.పీ. విష సంస్కృతిని ఆకళింపు చేసుకున్నారన్నారు. బీ.సీ. సామాజిక వర్గానికి చెందిన మహేష్ కు పార్టీలో ఎంతో ప్రాధాన్యమిచ్చి ఉన్నత పదవులు ఇచ్చారని చెప్పారు.
శివశంకర్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ స్థానం నుంచి మహేష్ కు పోటీ చేసే అవకాశం కల్పించారు. అలాగే జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జీగా పార్టీలో సముచిత స్థానమిచ్చి గౌరవించారు. విజయవాడలో జనసేన పార్టీ అభివృద్ధికి పని చేయకున్నా భరించామని 2014కు ముందు, ఆ తర్వాత ఆయన ఆర్థిక స్థితి ఎలా పెరిగిందో అక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. ఆధిపత్య ధోరణితో బెజవాడలో జనసైనికుల్ని బెదిరింపులకు గురి చేసి వారిని వేధించిన సంఘటనలు అనేకమున్నాయని ఆయన అన్నారు.