పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లూరు లిఫ్ట్కి సంబంధించి 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు భారీ నష్టం కలిగిందని తక్షణమే ఆ పంటలకు నష్ట పరిహారం ఇప్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) వినతిపత్రాన్ని అందించారు. పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్లూరుకు సంబంధించి ప్రెజయిర్ పాడవడం వల్ల సాగునీరు సరఫరా జరగలేదన్నారు. ఈ సమస్యను తాను సుమారు రెండు నెల క్రితం స్వయంగా పరిశీలించి పరిస్థితులను సంబధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు దానికి సంబంధించి సిఎస్ఆర్ నిధులను ఇచ్చి ప్రెజర్మెంట్ రిపేరు చేయించగా అది నాలుగు రోజులు మాత్రమే పనిచేసి తర్వాత మూలన పడిపోయిందన్నారు. సుమారు 16 గ్రామాలకు చెందిన 31 వేల ఎకరాలలో 25 వేల ఎకరాలకు పంట నష్టం కలిగినట్లు చెప్పారు. ఎకరాకు 50వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని నెహ్రూ డిమాండ్ చేశారు. అలాగే ఈ తాళ్లూరు లిఫ్ట్ నిర్వహించడం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని నెహ్రూ సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎండి జహీరుద్దీన్ జిలానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.