రానున్న దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా ప్రమాదాలకు తావులేని పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలతో బాణాసంచా విక్రయాలను అనుమతించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్. సతీష్ కుమార్ సంయుక్తంగా వివిధ శాఖల అధికారులతో రానున్న నవంబరు 12వ తేదీన జరుపుకోనున్న దీపావళి పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణపై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం వినాయక చవితి, దసరా పండుగలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించామని, ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చేపట్టిన చర్యలను ఆమె అభినందించారు.
అదే స్పూర్తితో వచ్చే నెల 12వ తేదీన జరుపుకోనున్న దీపావళి పండుగ సందర్భంగా ఆన్ని ముందస్తు జాగ్రత్తలతో కూడిన పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని ఆమె కోరారు. ఇందులో భాగంగా అనుమతి లేకుండా ఎవరూ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలు నిర్వహించకుండా రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు నిశితమైన నిఘా, ఉమ్మడి తనిఖీలు నిర్వహించాలన్నారు. అలాగే అనుమతులు పొందిన కేంద్రాలు అన్ని ప్రామాణిక జాగ్రత్తలు తప్పని సరిగా పాటించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. దీపావళి పండుగ ముందు మూడు రోజులు పాటు మాత్రమే బాణాసంచా విక్రయాలను, నిర్థిష్ట వేళల్లో అనుమతించాలని సూచించారు. డివిజన్ స్థాయిలో ఆర్డిఓ, డిఎస్పి, ఫైర్ ఆఫీసర్, మండల స్థాయిలో తహశిల్దారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఫైర్ సిబ్బంది అనువైన, సురక్షితమైన మైదానాలను పరిశీలించి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించాలని ఆదేశించారు.
సమావేశంలో డి.ఆర్.ఓ. కె. శ్రీధరరెడ్డి, కాకినాడ ఆర్డీవో ఈట్ల కిషోర్, కాకినాడ, పెద్దాపురం డీఎస్పీలు మురళీకృష్ణ రెడ్డి, కె.లతాకుమారి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్.సురేంద్ర ఆనంద్, తదితర అధికారులు పాల్గొన్నారు.
దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా
![WhatsApp Image 2023-10-25 at 7.03.13 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-25-at-7.03.13-PM.jpeg?resize=1280%2C629&ssl=1)