నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని శివ్ ఖేరా తన పిటిషన్లో పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలిచినట్టు నిర్ధారించి ప్రకటిస్తారు. మరి అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. అప్పుడు ఏం చేయాలి?. అంటే దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలూ రూపొందించలేదు.
ఈ నేపథ్యంలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ శివ్ ఖేరా అనే రచయిత తన పిటిషన్ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ శివ్ ఖేరా తన పిటిషన్లో విజ్ఞప్తి చేయడం గమనార్హం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాగా.. ఈ అంశంపై కోర్టు భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.