ఆస్తి పన్ను, నీటిమీటర్లు, యూజర్ చార్జీల పై సమీక్ష..
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో యూజర్ చార్జీలు, ఆస్తి పన్నులు, నీటి మీటర్ల బకాయిల పై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఆర్వోలు, డిఈలు, ఏఈలు, సచివాలయ అడ్మిన్లు, ఎమినిటీ కార్యదర్శులు, శానిటరీ సూపర్వైజర్లు,ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ పరిధిలో నీటి మీటర్ల బకాయిలకు సంబంధించి రూ. 4 కోట్ల వరకు వసూళ్లు కావలసి ఉందన్నారు.
బకాయిదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, స్పందించని వారి కుళాయి కనెక్షన్లను కట్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 20 కుళాయి కనెక్షన్ల తొలగించామని, నోటీసులకు స్పందించని బకాయి దారులపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నీటి మీటర్ల బకాయిల వసూళ్ల కోసం నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. సుమారు 8 ఏళ్లుగా బకాయి పడ్డ యాంకరేజ్ పోర్ట్ నుంచి రావలసిన రూ. 1.88 కోట్లు ఇటీవలే మేరిటైం బోర్డు నుంచి వసూలు అయిందని, అదే రీతిలో మిగిలిన బకాయిలను కూడా వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆస్తి పన్నుకు సంబంధించి రూ 20 కోట్ల వరకు వసూలు కావలసి ఉందని, దీనిపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం వసూలు చేస్తున్న యూజర్ చార్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రతి బుధవారం చేసే స్పెషల్ డ్రైవ్ ద్వారా మొదటి వారంలోనే యూజర్ చార్జీలు వసూలు అయ్యేలా ఆయా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హూపర్ టిప్పర్ వాహనాల నిర్వహణకు ప్రతి నెల రూ. 56 లక్షలు ఖర్చు అవుతుందని, యూజర్ చార్జీల ద్వారా ఆ సొమ్ము సకాలంలో వసూలు కాకపోతే, సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇది అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరపాలక సిబ్బందితో పాటు ప్రజలు కూడా సహకరించి సకాలంలో యూజర్ చార్జీలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు చెక్కా రమణ, ఎం ఎస్ నిర్మల, శానిటరీ సూపర్వైజర్లు జిలాని, రాంబాబు, డిఇ సుబ్బారావు, పలువురు ఏఈలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.