వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వాటి నివారణకు చర్యలు తీసుకునే విధంగా సకల ఏర్పాట్లను పరిశ్రమల శాఖల యజమానులు సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి. రాధాకృష్ణ చెప్పారు. కాకినాడ నగరంలో జిల్లాలో పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర విపత్తుల సంస్థలు ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారంతో పలుచోట్ల మాక్డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కాకినాడలోని ఎన్సీఏస్ స్టోరేజ్, దేవి ఫిషరీస్ వంటి పలు కర్మాగారాల్లో ఎక్కువగా అమ్మోనియం గ్యాస్ వినియోగిస్తారని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే అంశంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. కాకినాడ నగరంలో ఎక్కువగా అమ్మోనీయం వినియోగిస్తున్నారని ఇది లీకై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు సూచనలు వారికి వివరించామన్నారు.
ప్రమాదాలు సంభవించినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై కూడా ఈ మాక్డ్రిల్ ద్వారా తెలుస్తుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సామర్లకోట తహశీల్దార్ వై. శ్రీనివాస్, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ లెఫ్ట్నెంట్ కమాండర్ కట్టా సాంబయ్యతో పాటు వైద్య ఆరోగ్య, విద్యుత్, కాలుష్య నివారణ మండలి, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.