ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ రోడ్ లో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహారదీక్ష లు ప్రారంభించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వి.వి. రమణ అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. కరప, పెదపూడి , జగ్గంపేట , ప్రత్తిపాడు , పిఠాపురం , పిఠాపురం టౌన్ మండలాల .యూ.టీ.ఎఫ్. కార్యకర్తలకు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. రవి చక్రవర్తి నూలు దండలు వేసి రిలే నిరాహారదీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు తమ కుటుంబ అవసరాల కోసం, వైద్య ఖర్చులకు, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న పి.ఎఫ్. 18000 కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సి.పి.ఎస్. ను రద్దు చేసి, ఓ.పి.ఎస్. ను పునఃరుద్ధరించాలన్నారు. ఓ.పి.ఎస్ ను పునఃరుద్ధరించే పార్టీలకే తాము ఓటు వేస్తామని, vote for ops అనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని తెలియజేసారు.