జిల్లాలో రాష్ట్రప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను స్థానికులంగా పరిష్కరించి సకాలంలో అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు సమావేశంలో వెల్లడించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు అధ్యక్షతన పెన్షనర్ల సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సత్తిరాజు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఎమ్.వి. వీరభద్ర స్వామి, తదితరులు పాల్గొని పెన్షనర్ల సమస్యల మీద ప్రసంగించారు.
వివిధ రకాల సమస్యల పైన ఏ.టీ.వో. ఎం. సోమయాజు, డి.ఏ. రాజమ్మ క్లుప్తంగా వివరించారు. తదుపరి డి.డి. ఎన్. శ్రీనివాసులు గారు మాట్లాడుతూ… అన్ని సమస్యలపై త్వరలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు పెన్షనర్ల సమస్యలపై సవివరమైన ఆదేశాలు ఇవ్వడానికి ప్రోగ్రాం తయారు చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా ప్రతినెల పెన్షనర్ల సంఘాలతో సమావేశాలు నిర్వహించి సమావేశంలో వచ్చిన సమస్యలపై సవివరమైన నివేదికలు తయారు చేసి వెంటనే సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.