రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతిపక్షం ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులిమి కుట్రలు చేస్తోందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత మండిపడ్డారు. అందులో భాగంగానే విజయవాడ సమీపంలోని కంచికచర్ల రాజీవ్ నగర్ కి చెందిన కాండ్రు శ్యాంకుమార్ ఘటనని వాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆమె తెలిపారు. కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… రాష్ట్రం వ్యాప్తంగా వైఎస్సార్పీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర అద్భుతంగా సాగుతోందని, అది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష టీ.డీ.పీ. అబద్దపు ప్రచారాలతో, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గతంలో చంద్రబాబు అరెస్ట్ పై ఆరోపణలు చేశారనీ… ఇప్పుడు కండిషనల్ బెయిల్ పై బయటకు రావడంతో విజయవాడ సమీపంలోని కంచికచర్లలో జరిగిన విద్యార్థుల మధ్య గొడవను దళితులపై దాడిగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలోని బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలంతా జగనన్నకి అండగా నిలుస్తున్నారన్నది ఈ సామాజిక సాధికార యాత్రతో రుజువవుతోందన్నారు. కంచికచర్ల ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేసిన దళితుల గుండెల్లో గూడు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లలేరు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.