కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగింది. మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ ఓపెన్ చేసే క్రమంలో దొంగతనం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచార అందించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ సతీష్కు మార్, పెద్దాపురం డిఎస్పి లతాకుమారితో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బృందాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ… ఉత్తరకంచి ఎస్.బీ.ఐ. బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగిందన్నారు. కొంతమంది వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లి గ్యాస్ కట్టర్లతో చోరీకి పాల్పడ్డారని నగదుతో పాటు బంగారం దొంగిలించారని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారంగా సుమారు 75 లక్షలు విలువచేసే సొత్తు చోరీ జరిగిందని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తించి అదుపులో తీసుకుంటామని తెలిపారు.