ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేసి వాలంటీర్ల తో ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టడం వలన ఎన్నికల కమీషన్ నిబంధనలతో రెండు నెలల పాటు ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో ఇబ్బంది పడే దుస్తితి వచ్చిందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. గత అయిదేళ్లుగా వృద్దులకు వితంతువులకు దివ్యాంగులకు నెలవారీ ఫించన్లందించే బాధ్యతలకు ప్రభుత్వ ఉద్యోగులు దూరం కావడం వలన ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
ఎంకిపెళ్ళిసుబ్బి చావు కొచ్చిందన్నట్టుగా సచివాలయం సేవలు త్రిశంకుచందమయ్యిందన్నారు. మధ్యలో ప్రజలు ఇబ్బంది పడేదుస్తితి రావడం పాలకుల వైఫల్యమేనని దుయ్యబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేసి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పై వుందన్నారు.
ఏప్రిల్, మే నెలల్లో ఫించన్లు పంపిణీ జాప్యం లేకుండా ఎన్నికల ప్రచారానికి తావులేకుండా పోలీస్ బెటాలియన్ మెన్ తో వాలంటీర్ల ద్వారా అందించే వెసులుబాటు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల కమీషన్ సుమోటోగా చర్యలు వహించాల్సిన అవసరం వుందని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు కోరారు. ఫించన్లతో రాజకీయ చెలగాటం తగదన్నారు.