తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.టి.జి. సత్య గోవింద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదని అలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు తెలిపారు.
పశు సంవర్ధక శాఖ పూర్తిగా సర్వే నిర్వహించి ఈ వ్యాధి ఆనవాళ్ళు ఎక్కడా లేవని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వలన మనుష్యులకు వ్యాప్తి చెంది చనిపోయిన దాఖలాలు లేవన్నారు. కోడి గ్రుడ్లు మరియు కోడి మాంసము సంప్రదాయ బద్దంగా ఉడికించి తినుటవలన ఏ విధమైన ఇతర వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం లేదన్నారు .