ఓ.ఎన్.జీ.సి. సంస్థ కాకినాడ సముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వై.సీ.పీ. పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆరోపించారు. మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నాలు ద్వారంపూడి చేస్తున్నారన్నారు.
ఏటిమొగ, దుమ్ములపేట, పర్లవపేట ప్రాంత బోటు ఓనర్స్ కు సమాచారం అందించకుండా కేవలం అధికార పార్టీ నాయకులతో జిల్లా అధికారులు నిర్వహించిన సమావేశంపై బోట్ ఒనర్స్ అసోసియేషన్ సభ్యులుతో కలిసి మంగళవారం కొండబాబు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.
కానీ అధికారులు ఎవరూ కార్యాలయానికి రాకపోవడంతో బాదిత మత్స్యకార వర్గాలతో కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి అధికారులు వచ్చేవరకు వెళ్లేది లేదని బైటాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా మధ్యాహ్నం 3.00 గంటలకు డిఆర్ఓ డీ.టీ. నాయక్ వచ్చి ఓ.ఎన్.జీ.సీ. ప్రతినిధులు, మత్స్యకార వర్గాలు బోటు ఓనర్స్ తో మరల సమావేశం నిర్వహిస్తామని కొండబాబుకు తెలియజేశారు.