మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ కే.బీ. అంబేద్కర్ చేస్తున్న సేవలను గుర్తించి కాకినాడ డివిజన్ కు చెందిన పోలీసులు అంబేద్కర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వన్ టౌన్ కానిస్టేబుల్ దుర్గారావు కుమార్తె గీతా వైష్ణవి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ కండిబోయిన వారి శ్రీ స్వచ్చంద సంస్థ మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ సేవలను గుర్తించి డి.ఎస్పీ. మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు.
ఈ సందర్భంగా డి.ఎస్పీ. మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ… ఎందరో అనాధ శవాల వద్దకు బంధువులు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న మృతదేహాలను తీసుకెళ్లి ఎటువంటి రుసుము ఆశించకుండా వారికి దహన కార్యక్రమాలు చేయడం పట్ల అంబేద్కర్ ఎంతో సేవ చేస్తున్నారన్నారు. ఇటువంటి వారిని సన్మానించుకుని వారిని ప్రోత్సహించాలని, ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందిస్తే ప్రోత్సాహంగా ఉంటుందని డి.ఎస్పీ. సూచించారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ సీ.ఐ. వి. సురేష్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.