ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక సీతారామనగర్ యూ పి హెచ్ సి ఆవరణలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని కమిషనర్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఎంతమంది శిబిరానికి వచ్చారు ? ఎంతమందికి వైద్య సేవలు అందించారు ? వంటి అంశాలను ఆరా తీశారు. నాలుగో డివిజన్ కు సంబంధించి సుమారు 336 మంది వివిధ వైద్య సేవల కోసం శిబిరానికి విచ్చేశారు. కంటి వైద్యం, చర్మవ్యాధులు, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలకు సంబంధించి అక్కడకు వచ్చిన రోగులకు వైద్యులు సేవలందించారు. వివిధ రకాల రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి సిఫార్సు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ… ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వైద్య శిబిరంలో సేవలందిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువుగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సిబ్బంది మరిన్ని మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ పృథ్వి చరణ్, మెడికల్ ఆఫీసర్ అశ్విత, వలంటీర్లు పాల్గొన్నారు.