మేడే స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా కూటమిను బలపరచాలని, ప్రతి ఒక్కరూ దేశాన్ని రక్షించుకోవాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రిలో సి.పి.ఐ. ,రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. సంయుక్తంగా వేలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు.
ముందుగా మేరకవీధి జట్లు లేబర్ యూనియన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రదర్శన అప్సర థియేటర్, ఉల్లిపాయల మార్కెట్ నుంచి సి.పి.ఐ. కార్యాలయం చేరుకుని అక్కడి నుండి తాడితోట సెల్టన్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కు చేరుకున్నారు.
కే. రామకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్క కార్మికుడు దేశం కోసం ఆలోచించాలని దేశాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. మరల మోడీ వస్తే దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ ఉండదని స్వయంగా బీ.జే.పీ. కేంద్ర మంత్రులే సెలవిస్తున్నారని ఆయన విమర్శించారు. హిట్లర్ లాంటి నియంత్రత్వ పాలన వస్తుందని ఆయన అన్నారు.