పిఠాపురం గెలుపుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి… విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని వెల్లడించారు.
జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దామన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 160 మంది పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… పిఠాపురం నాకు ప్రత్యేకమైన నియోజకవర్గమని, గెలుపు కోసం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోలేదని అన్నారు. రాష్ట్రం కోసం పని చేసే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలన్న సమయంలో పిఠాపురం నుంచి వచ్చిన స్పందన నా గుండెకు తాకిందన్నారు.