బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై విజయవాడ సి.ఎస్. క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ… భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు-మచిలీపట్నాల మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు.
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, .మిగతా జిల్లాల్లోను ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కావున అధికారులు అంతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సి.ఎస్. ఆదేశించారు.