పోస్టర్ను ఆవిష్కరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నారాము
![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/UTF.jpeg?resize=640%2C288&ssl=1)
కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి ఆధ్వర్యంలో… అక్టోబర్ 18వ తేదీ నుండి రాష్ట్ర కేంద్రంలో ఓపి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జరిపేటువంటి నిరవధిక దీక్షలు విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరవధిక దీక్ష విజయవంతం కావాలి అన్నారు. ఆంద్ర
ప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఇంకా దుర్మార్గమైన జిపిఎస్ విధానం తీసుకురావడం ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసగించడమే అన్నారు. చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర కేంద్రం లోనూ, 19వ తేదీ కాకినాడ యూటీఎఫ్ హోమ్ లో 20వ తేదీ నుండి డివిజన్ కేంద్రాల లోను నిరవధిక దీక్షలు చేపడతామని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు కలిసి వచ్చే సంఘాలను కలుపుకుంటూ యూటీఎఫ్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఆ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఐ. ప్రసాదరావు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ పూర్తిచేసుకున్న అందరికీ కేంద్రప్రభుత్వ మెమో 57 ప్రకారం మన రాష్ట్రం లో ఉన్న 11000 మందికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.