ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీ.ఐ.వో. డా. కె. రత్నకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ రూరల్ మండల రెవిన్యూ అధికారి కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సబ్ డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్ర్పోప్రియెట్ అథారిటీ, డివిజన్ స్థాయి పీ.సీ., పీ.ఎన్.డీ.టీ. సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టామన్నారు. ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్ట రీత్యా నేరమని తెలిపారు. డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పిండ లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమ, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామస్థాయిలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు సంయుక్తగా గర్భిణీ స్త్రీ గృహాలను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో గైనకాలజిస్ట్ డా. పి. సుజాత, జీ.జీ.హెచ్. రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఆర్. ఇందిరా శ్రీ శైలజ,ఇతర సిబ్బంది ఇతర పాల్గొన్నారు.