రాజ్యాంగం పాలన సౌలభ్యం కోసం న్యాయవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ పేరుతో మూడు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క హక్కులను కార్యనిర్వాహక వ్యవస్థకు బదలాయించడం జరుగుతోందని ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని సిటిజన్స్ ఇనిషియేటివ్ కార్యదర్శి దువ్వూరు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం మూడు వ్యవస్థలకి మధ్య హక్కులు, బాధ్యతలు స్పష్టంగా ఏర్పాటు చేసిందని ఒక వ్యవస్థ విధుల్లోకి మరొక వ్యవస్థ చొరబడటం, చొప్పించడం రాజ్యాంగ విరుద్ధమని దువ్వూరి అన్నారు. ఈ చట్టం ప్రజల మనసుల్లో వారి వారి ఆస్తులకు సంబంధించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఈ చట్టం న్యాయస్థానాల ముందు నిలువదని ప్రభుత్వం తక్షణం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఉపసంహరించుకొని పరువు కాపాడుకోవడం మంచిదని ఆయన అన్నారు.