విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా గతంలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణత కాని విద్యార్థులచే తిరిగి పబ్లిక్ పరీక్షలు రాయించడం లేదా నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేర్చే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పాఠశాల విద్యాశాఖ, నైపుణ్య శిక్షణ, ఇంటర్ మీడియట్ అధికారులతో మిషన్ జీ.ఈ.ఆర్. లో భాగంగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు మధ్య గల విద్యార్థులనందరిని ఎన్రోల్మెంట్ చేయడం, గతంలో పదో తరగతి, ఇంటర్ తప్పిన విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, నైపుణ్య శిక్షణ వంటి ఇతర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… జిల్లాలో గతంలో పదో తరగతి, ఇంటర్ తప్పిన విద్యార్థులను తిరిగి పబ్లిక్ పరీక్షలు రాయించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. లేదా ఓపెన్ స్కూల్, నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ఎన్రోల్మెంట్ చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ, డీఈవో జీ.నాగమణి, ఇంటర్ మీడియట్ ఆర్ఐవో నరసింహరావు, నైపుణ్య శిక్షణ అధికారి డి.హరిశేషు, డిప్యూటీ డీఈవోలు డి.సుభద్ర, డానియల్ రాజ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.