జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ఇన్స్పైర్ ప్రదర్శనను విజయవంతం చేయవలసిన బాధ్యత విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి సూచించారు. అమలాపురం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సూర్యనగర్ నందు ఈ నెల 14 వ తేదీన నిర్వహించనున్న ఇన్స్పైర్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ముందస్తు ఏర్పాట్లపై జిల్లా సైన్స్ అధికారి జీ.వీ.ఎస్. సుబ్రహ్మ ణ్యం ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముందస్తు ఏర్పాట్లు పటిష్టం గావించి ఈ విద్య వైజ్ఞానిక సదస్సు చక్కటి ప్రణాళిక సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 14 వ తేదీన స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సూర్య నగర్ నందు జరిగే ఈ ప్రదర్శనకు అన్ని ముందస్తు ఏర్పా ట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
ప్రదర్శన నిర్వహణకు విధులకు కేటాయించిన సిబ్బంది వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థినీ, విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజరాజేశ్వరి, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ బి. హనుమంతరావు, మండల విద్యాశాఖ అధికారి దుర్గా దేవి, తదితరులు పాల్గొన్నారు.