అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టగా మారింది. వచ్చే ఎన్నికలు ఆ పార్టీకి మూడో సారి బల పరీక్ష కాబోతోంది. ఎందుకంటే గత మూడు దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఆ నియోజక వర్గాన్ని కైవసం చేసుకోవటం, రెండు దఫాలుగా వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బలు తగలడమే. ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగోశ్వరరావు అక్కడ మరోసారి తెలుగుదేశాన్ని నెగ్గించాలనే సంకల్పంతో పావులుకదుపుతున్నారు. ఆయనకు జన సేన పార్టీ మండపేట ఇంచార్జి వేగుళ్ల లీలాకృష్ణ తోడయ్యారు. తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తు నేపధ్యంలో వారిద్దరూ సమన్వయంతో పనిచేయటం మరోసారి తెలుగుదేశం జండా ఎగిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కాగా ఈ రాజకీయ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టగా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రామచంద్రాపురం నియోజక వర్గంలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా రానించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట ఇంచార్జిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా టికెట్ల కేటాయింపు అనంతరం రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయోనని నియజకవర్గ ప్రజలు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం 2008లో ఏర్పడింది. సుమారు 3.50 లక్షల జనాభా కలిగిన మండపేట మండలం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండేది. జిల్లాల పునర్విభజన అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విలీనమైంది. ఈ నియోజకవర్గంలో 2,15,390 ఓటర్లు నమోదైనట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అందులో పురుషులు 1,05,084 కాగా మహిళలు 1,10,306 ఉన్నారు. ఈ నేయోజకవర్గంలో ప్రతి ఎన్నికలకు సుమారు 82 నుంచి 97 శాతం వరకూ పోలింగ్ నమోదవుతోంది. గత 2014, 2019 లలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పరాభవం ఎదురైంది. ఈ నేపధ్యంలో రామచంద్రాపురం నియోజకవర్గంలో తిరుగులేని సీనియర్ రాజకీయ నాయకుడైన తోట త్రిమూర్తులను బరిలోనికి దించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేపడుతోంది.
కాగా అక్కడి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ పరిణామం మింగుడుపడనిదిగా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తోట త్రిమూర్తులపై రామచంద్రాపురం వెంకటాయపాలెం దళిత యువకుల శిరోముండనం అనంతరం దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పాతుకుపోయిన విషయం తెలిసిందే. సామాజిక సమీకరణల నేపధ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సామాజిక వర్గానిదే అక్కడ ఆదిపత్యం. ఈ నేపధ్యంలో రెండు వర్గాల వ్యతిరేకతతో పాటుగా పార్టీ అంతర్గత విభేదాలను కూడా తోట త్రిమూర్తులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంవత్సరం – పార్టీ – గెలుపొందినవారు – పోలైన ఓట్లు – ప్రత్యార్థి – పార్టీ – పోలైన ఓట్లు
2009 : తెలుగుదేశం – వేగుళ్ల జోగోశ్వరరావు – 78,029 – వివిఎస్ చైదరి – పీఆర్పీ – 50,664
2014 : తెలుగుదేశం – వేగుళ్ల జోగోశ్వరరావు – 1,00,113 – జి వెంకటస్వామి నాయుడు – వైఎస్ఆర్సీపీ – 64,099
2019 : తెలుగుదేశం – వేగుళ్ల జోగోశ్వరరావు – 68,104 – పిల్లి సుభాష్ చంద్రబోస్ – వైఎస్ఆర్సీపీ – 67,429.