ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేక అధికార వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు ఖండించారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏ.పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల రెడ్డి రాకతో పార్టీ మరింత బలపడిందని అన్నారు.
ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడం చూసి ఓర్వలేకనే తమ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి పై దిగజారి మరీ వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దిగజారుడు విమర్శలు వైసీపీ నాయకులు మానుకోవాలని, లేకుంటే తాము కూడా అదే రీతిగా ఘాటుగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి వాసు, ధనకోటి, వల్లూరి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.