ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ప్రజలకు నిజంగా సంక్షేమం అందించిన ప్రభుత్వం ఏమిటో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెద్దాపురం నియోజక వర్గ వై.సీ.పీ. ఇంఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల సముదాయాన్ని హౌసింగ్ చైర్మన్ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పీ.పీ. బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పడకాలు అందని ద్రాక్షగా ఉన్నాయన్నారు. వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో చేసిన హామీలన్నీ పూర్తిస్థాయిలో నెరవేరినట్టు చెప్పారు.
వాలంటీర్, సచివాలయం వ్యవస్థలు ఏర్పాటు చెయ్యడం ద్వారా పార్టీలతో సంబంధం లేకుండా ఇంటిపై ఏ పార్టీ జెండా ఎగురుతున్నా ఎవరినీ వదిలిపెట్టకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వంగా వై.సీ.పీ. ప్రభుత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరలా పలు పార్టీలు మీ ముందుకు వచ్చి చేతగాని హామీలు చేసేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పిటీసి ప్రతినిధి ఎలిశెట్టి నరేష్, గ్రామ సర్పంచి సత్యాడి ధనలక్ష్మి సత్యనారాయణ, ఉప సర్పంచి కొప్పిరెడ్డి రాధాకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.