విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం సమగ్ర శిక్షా కొత్త లోగో ఆమోందించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, ఐ.ఏ.ఎస్. బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని అధికారిక సంప్రదింపుల్లో, కార్యక్రమాల్లో కొత్త లోగోను వినియోగించాలని రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి అధికారులను కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2018-19 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం సమగ్ర శిక్షా పథకాన్ని ప్రారంభించిందన్నారు.
పాఠశాల విద్యలో భాగంగా ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు పిల్లలందరికీ సమానమైన, సమ్మిళిత తరగతి గది వాతావరణంలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. విభిన్న నేపథ్యం, బహుభాషా అవసరాలు, విభిన్న విద్యా సామర్థ్యాలు, అభ్యాస ప్రక్రియల్లో విద్యార్థులను చురుగ్గా పాల్గొనేలా సమగ్ర శిక్షా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం ఐదేళ్ల కాలానికి అంటే 2021-22 నుండి 2025-26 వరకు పొడిగించినట్లు ఆయన అన్నారు.