గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ సమ్మె కు సిద్ధమవుతున్నట్లు సూపరింటెండెంట్ డా. విఠల్ కు మరోసారి విన్నవించారు. ఈ నేపథ్యంలో సిఎస్ఆర్ఎంఓ, ఎడి లను పిలిపించి కాంట్రాక్టర్ ని రప్పించి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్ వారి ఆదేశాలకు కూడా కాంట్రాక్టు సంస్థ దిగి రాకపోతే సమ్మె కు దిగాలని కార్మికులు నిర్ణయించారు. ముందుగా ఆసుపత్రి మాతా శిశు విభాగం వద్ద నుండి ఓపి విభాగం వరకు నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ లు మాట్లాడుతూ… గత 30 రోజులు గా విధులకు ఆటంకం లేకుండా ఆందోళన కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సూపరింటెండెంట్ వారి స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. సమ్మె జరిగితే బాధ్యత కాంట్రాక్టు సంస్థదే అని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ తో పాటు యూనియన్ నాయకులు జె. శేషు, ఆర్. రమేష్, ఎస్. వాసు, బి. మంగతాయారు, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.