ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని వాటి వివరాలు తక్షణమే కోర్టుకు, ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలని అత్యున్నత నాయస్థానం తీర్పు ఇచ్చి 20 రోజుల లోపు వివరాలు ఇవ్వాల్సి ఉందని సీ.పీ.ఎం. తెలిపింది. కాని చెప్పిన సమయం దాటినా కోర్టుకు స్టేట్ బ్యాంక్ వివరాలు ఇవ్వకపోగా జూన్ నెల వరకు గడువు అడగడాన్ని తప్పు పడుతూ సీ.పీ.ఎం. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ వద్ద నిరసనలు చేయాలని పిలుపుపిచ్చింది. ఇందులో భాగంగా సామర్లకోటలో ఉన్న స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద సీ.పీ.ఎం. పట్టణ కమిటీ నిరసన తెలియచేసి వినతిపత్రం అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సీ.పీ.ఎం. జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ… స్టేట్ బ్యాంక్ ఎన్నికల బాండ్లు రాజ్యాంగవిరుద్దమని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులు ఇచ్చిన ఎన్నికల నిధులు తెలియకుండా ఉండడానికి బీ.జే.పీ. ఎన్నికల బాండ్లు విధానం తీసుకువచ్చిందని వాటిలో 90 శాతం బీ.జే.పీ. ఖాతాలలోకి వెళ్ళాయని చెప్పారు. సుప్రీం కోర్టు బాండ్లు తప్పుపడుతూ మార్చి 4లోపు సుప్రీం కోర్టుకు, మార్చి 13లోపు ఎన్నికల కమిషన్ కు వివరాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని అన్నారు.
అయినా స్టేట్ బ్యాంక్ ఇంకా వివరాలు ఇవ్వకుండా జూన్ వరకు గడువు అడగడం వెనుక ఎన్నికలు అయ్యేవరకు సాగదీసి తప్పించుకోవాలని దురుద్దేశం ఉందని తక్షణమే ఎన్నికల బాండ్ల వివరాలు అందచేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నికల బాండ్లు తీసుకోని ఏకైక రాజకీయ పార్టీ సీ.పీ.ఎం. పార్టీ మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమం లో సీ.పీ.ఎం. శాఖ కార్యదర్శి బాలం శ్రీనివాస్, విప్పర్తి కొండలరావు, కోనా శివకుమార్, తుంపాల శ్రీను, కరణం ఏడుకొండలు, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.