ఈ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీ.జే.పీ. కనీసం ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, కేరళ బీ.జే.పీ. కి చెందిన ప్రభారి ప్రకాశ్ జవదేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనితీరు, దార్శనికతను ఎక్కువగా గుర్తించే కేరళీయుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు ఉందని చెప్పారు. ఇంతకు ముందు కనీసం ఐదు సీట్లు వస్తాయని అన్నాం.. ఇప్పుడు ఫైవ్ ప్లస్ అనే నమ్మకంతో ఉన్నామని అన్నారు. గత సారి నాలుగు నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఓట్లను సాధించాం. ఈసారి వాటిని, ఇతర స్థానాలలో కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నామని నొక్కి చేప్పారు. దక్షిణ భారతదేశం నుండి అత్యధిక సంఖ్యలో ఎం.పీ. లను కలిగి ఉన్న పార్టీగా బీ.జే.పీ. ఆవిర్భవిస్తుందని, మేము ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఎం.పీ. లను కలిగి ఉన్న అతిపెద్ద కూటమికి నాయకత్వం వహిస్తామని అన్నారు.