బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి వార్తలను, జరుగుతున్న పరిణామాల్ని మీడియా సమాజానికి చేరవేస్తూ ఉంటుందన్నారు. విశాఖపట్నం బర్మా కాలనీలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనలో బాధితులు చెప్పింది, వారు చేసిన ఆరోపణలను మీడియాలో ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతిపైనా, వాటి ప్రతినిధులపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.
వై.సీ.పీ. ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో మీడియాకు రకరకాల రాజకీయ రంగులు పులిమి, వర్గాలుగా విభజించి మీడియా నియంత్రణకు జీ.వో. నంబరు 1 తీసుకువచ్చారని చెప్పారు. బాధితులతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించినందుకు విశాఖ నార్త్ స్థానం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపైనా కేసు నమోదు చేయడం చూస్తే ఈ కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అనే అర్థం అవుతుందన్నారు. సుంకర ధనలక్ష్మి, తన కుటుంబంపై దాడి చేసింది వారెవరో, దానికిగల కారణాలేమిటో పోలీసులు ప్రజల ముందుపెట్టాలని కోరారు.