జిల్లాలో సాధారణ ఎన్నికల ప్రక్రియ సజూవుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జే. నివాస్ ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణలో మొదటి నుంచి చివరి వరకు భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అంతా అందరికి సహకారంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసామన్నారు. మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియ జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో అంకితభావం, నిబద్దతతో వ్యవహరిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.