బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పేర్కొన్నారు. బాల్య వివాహాలను నియంత్రించడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల ఆదేశాల మేరకు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాలను నియంత్రించే అంశంపై కార్పొరేషన్, మెప్మా, ఐ.సి.డి.ఎస్., విద్యాశాఖాథికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న కాకినాడ వంటి నగరాలలో కూడా ప్రజల్లో సరైన అవగాహన లేక బాల్య వివాహాల దిశగా ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. ముఖ్యంగా మురికివాడల ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. బాల్య వివాహాలను జరిపించడం, ప్రోత్సహించడం నేరమన్నారు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష రూ. లక్ష జరిమానా ఉంటుందన్నారు. ఈ విషయంలో ఆలయాల్లోని పురోహితులు, చర్చిల్లోని పాస్టర్లు, మసీదుల్లోని ఇమామ్ లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బాల్యవివాహాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డివిజన్ల వారీగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. ప్రవీణ మాట్లాడుతూ… కాకినాడను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఉద్యోగి కష్టించి పనిచేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎంచ్.వో. డాక్టర్ పృథ్వి చరణ్, 101 కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.